కోస్గి, నవంబర్ 24 : కర్ణాటకలో లేని గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలు చేస్తుందని భూగర్భ జల వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో ఎమ్మెల్యే, కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మితే మోసపోతామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓటమి భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు గతంలో ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని వాటిని కూడా నెరవేర్చిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు.