హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాలు కురుస్తున్నందున వంట వండే సమయంలో, ఆహారం సిద్ధం చేసేటప్పుడు, భోజనాలు వడ్డించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను నిజామాబాద్ దవాఖానాకు వెళ్లాల్సిందిగా మంత్రి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్, దవాఖాన వైద్యులతో సమన్వయం చేసుకుని, నాణ్యమైన వైద్యసేవలందించేలా చూడాలని ప్రొఫెసర్ వెంకటరమణకు సూచించారు.