హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూ విద్యతోపాటు సాంస్కృతిక ప్రతీకలుగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి కల్చర్ ఫెస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సోమవారం మంత్రి హైదరాబాద్లోని తన నివాసంలో సత్కరించారు.
బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ నుంచి 81 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏడు సాంస్కృతిక విభాగా ల్లో బహుమతులను సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గురుకుల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సత్యవతి ఆకాంక్షించారు.