హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో బీటూబీ, బీటూసీ సమావేశాలు, హస్తకళా ప్రదర్శన, ఫుడ్కోర్టుల ఏర్పాటుతోపాటు పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ సంస్థలకు ఎక్స్లెన్స్ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.
స్థానిక పర్యాటక రంగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో పర్యాటక దినోత్సవాలను నిర్వహించాలని ఆదేశించామని చెప్పారు. ఈ నెల 27న పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వివిధ కార్యక్రమాలను శనివారం ఆయన విలేకరులకు వివరించారు. ఈసారి గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ ట్యాగ్లైన్తో వేడుకలు నిర్వహించనున్నామని, సినీ గాయకుడు హేమచంద్ర బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో పర్యాటక రంగం దేశావిదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్నదని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటికే 86,645 మంది పర్యాటకులు రాష్ర్టాన్ని సందర్శించినట్టు తెలిపారు.
వారం రోజుల్లో జంగిల్ సఫారీ ప్రారంభం
మహబూబ్నగర్ జిల్లాలో 26 వేల ఎకరాల విస్తీర్ణంలో జంగిల్ సఫారీని అభివృద్ధి చేశామని, వారం రోజుల్లో దీన్ని ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. జంగిల్ సఫారీతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహబూబ్నగర్ జిల్లాలో 2,097 ఎకరాల్లో అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని, యాదాద్రి ఆలయ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లు, ఇతర పర్యాటక స్థలాలతో యాదాద్రి సర్క్యూట్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
బౌద్ధారామాల అభివృద్ధిపై ప్రశంసలు
రాష్ట్రంలో బుద్ధవనంతోపాటు బౌద్ధారామాలు, యాదాద్రి ఆలయ అభివృద్ధిని శ్రీలంక ప్రధాని ప్రశంసించినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల తాను శ్రీలంకలో పర్యటించినప్పుడు అక్కడి ప్రధానితో సమావేశమై తెలంగాణలో బౌద్ధారామాల అభివృద్ధి గురించి వివరించినట్టు చెప్పారు. వాటిని తిలకించేందుక శ్రీలంక ప్రధాని ఎంతో ఆసక్తితో ఉన్నట్టు వెల్లడించారు. త్వరలో చార్మినార్, వేయి స్తంభాల గుడి, గోల్కొండ కోట, పిల్లలమర్రి, బుద్ధవనం తదితర ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు కోసం దరఖాస్తు చేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.