Damodara Raja Narasimha | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో పనిచేసిన తమకు స్టాఫ్నర్స్ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని నర్సులు వాపోయారు. ‘పుణ్యానికి చేశారా? జీతం తీసుకున్నారు కదా?’ అని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రోగులకు చికిత్స అందించేందుకు టిమ్స్ను ప్రత్యేక దవాఖానగా మార్చింది.
ఇందులో పనిచేసేందుకు నర్సులను తాత్కాలికంగా నియమించుకున్నది. తాము కొవిడ్ సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా స్టాఫ్నర్స్ పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ ఇస్తామని గతంలో వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు హామీ ఇచ్చారు. తాజాగా 7,094 పోస్టులు భర్తీచేస్తున్న నేపథ్యంలో తమకు ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించి, చివరికి సచివాలయంలో మంత్రి దామోదరను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హామీతో తమకేం సంబంధమని, కొవిడ్ సమయంలో ఏమైనా పుణ్యానికి చేశారా? జీతాలు తీసుకొనే చేశారు కదా’ అని వ్యాఖ్యానించారని బాధిత నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.