నిర్మల్ అర్బన్, ఆగస్టు 29: పర్యావరణహిత వినాయక ప్రతిమలనే పూజించాలని పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని క్లిమామ్ ఆధ్వర్యంలో తయారుచేసిన గోమయ వినాయక ప్రతిమలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మల్లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: మట్టి గణపతులను ప్రతిష్టించి పూజిస్తే బంగారు, వెండి నాణాలను అందజేస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తెలిపారు. మట్టి వినాయకున్ని పెట్టి పూజించే వారు సెల్ఫీ ఫోటో లేదా వీడియో వాట్సాప్ చేస్తే 11వ తేదీన లక్కిడ్రా తీస్తామని సోమవారం మీడియాకు వెల్లడించారు. మొదటి 10 మంది విజేతలకు ఒక గ్రాము బంగారు నాణెం, తరువాతి 50 మందికి 10 గ్రాముల వెండి నాణెం బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
రామగిరి: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో వైఆర్పీ ఫౌండేషన్ సౌజన్యంతో సోమవారం నల్లగొండలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. నల్లగొండ గడియారం సెంటర్లో వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యెలిశాల రవిప్రసాద్తో కలిసి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేంద్రాచారి, ఏడీవీటీ ఇన్చార్జి శివకుమార్, తెలంగాణ టుడే బ్యూరో ఇన్చార్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.