హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని, కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందనది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంపై మండిపడ్డారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వ్యవసాయరంగానికి 22శాతం కేటాయింపులు తగ్గించారని, గత బడ్జెట్లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఈ సారి రూ.1.75లక్షల కోట్లకు కుదించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెల్లగా ఎరువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రైతులపై పెట్టుబడి భారం పెరిగిందన్నారు.
అదే విధంగా ఉపాధి హామీ పథకానికి రూ.29,400 కోట్లు తగ్గించడం దారుణమన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూపాయి కూడా పెంచలేదన్నారు. కానీ, విఫలమైన పంటల బీమా పథకానికి రూ.1,249 కోట్లు పెంచారని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేటాయించింది కేవలం రూ.లక్ష మాత్రమేనని, దీన్ని బట్టి గమనిస్తే సీసీఐ ఇక కనుమరుగైనట్లేనని, ఇది పత్తి రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. కోటి మంది రైతులను మూడేళ్లలో సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లిస్తామని, పది వేల బయో ఇన్ఫుట్ రిసోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, మైక్రో ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గొప్పగా ప్రకటించిందని, కానీ ఇందుకోసం బడ్జెట్లో రూపాయి కేటాయించిన దాఖలాలు లేవన్నారు.
రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్ పథకానికి కూడా బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదన్నారు. రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సాహకరంగా లేవని, ఈ బడ్జెట్తో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఎప్పటి మాదిరే ఈ బడ్జెట్లోనూ తెలంగాణకు మొండిచేయి చూపారని, కానీ ఎన్నికలున్న కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించారన్నారు. తెలంగాణలో మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.