రైతులు అవసరాలకు మించి వరి వేయొద్దని, ముఖ్యంగా యాసంగిలో వరి వద్దని సూచిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశ, ప్రపంచ అవసరాల దృష్ట్యా డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే వేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లా క్యాథన్పల్లిలోని ఓ హాల్లో వానాకాలం పంటల సాగుపై మంచిర్యాల, కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని వ్యవసాయ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, రైతును మించిన మహనీయుడు లేడని, కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయం చేసి ప్రజలను కాపాడారని తెలిపారు. సమాజ ఉన్నతికి ఉపయోగపడేవాడు రైతు అని పేర్కొన్నారు. పంటల మార్పిడి కీలకమని రైతులకు సూచించారు. నూలు, పెసలు, మినుములు, పొద్దుతిరుగుడు, వేరు శనగ వేస్తే మంచి లాభం ఉంటుందని వివరించారు. వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామిగా ఉండాలన్నారు. రైతు వేదికలు క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. పత్తి సాగు విస్తరించాలని, మంచి విత్తనాలను వేసుకోవాలన్నారు.
పత్తికి మద్దతు ధరకు మించి 2, 3 వేలు అధికంగా ధర వచ్చిందని, రైతుల జీవితాలతో చెలగాటమాడే హెచ్ టీ కాటన్ వాడవద్దని మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. సమీకృత వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణలో వ్యవసాయం చాలా మెరుగుపడిందని తెలిపారు. రైతు సుభిక్షంగా ఉండాలని, బాగుపడ్డ వ్యవసాయంలో ప్రతి రైతూ ధనవంతుడు కావాలని ఆకాంక్షించారు.
నూతన వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేయాలి: బాల్క సుమన్
చెన్నూర్ నియోజకవర్గంలో నూతన వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేసి, రైతువేదికలు నిర్మించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. పంటమార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ పంటలను అధికంగా ప్రోత్సహించాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. జైపూర్ మండలం కేంద్రంగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ. 1658 కోట్లు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో అటవీ, సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్లు కోవా లక్ష్మి, నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్లు భారతి హోలికెరీ, రాహుల్ రాజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.