హైదరాబాద్ : వ్యవసాయం వృత్తి కాదని, సమస్త జీవరాశికి ఇదే ఆధారమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సాగు చట్టాలను పెండింగ్లో పెట్టిందని గుర్తు చేశారు. దేశంలో రాబోయే రోజుల్లో ప్రజలే విపక్షపాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ప్రసాద్ థియేటర్లో ‘రైతన్న’ చిత్రం ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమాను వీక్షించిన మంత్రి నిరంజన్ రెడ్డి నారాయణమూర్తి ఎంతో కష్టపడి రైతన్న సినిమా తీశారని అన్నారు. రైతుల కష్టాలపై చాలా గొప్ప సినిమా తీశారని కితాబిచ్చారు. రైతన్న సినిమాను మిగితా భాషల్లోకి కూడా అనువదించాలన్నారు.