హైదరాబాద్ : రైతుబంధు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఈ పథకం గొప్ప ఊతంగా మారింది. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతుబంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకొన్న దాఖలాలు లేవు, ఆ ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు. పల్లెపల్లెనా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పంట దిగుబడులతో అభిషేకం చేశారు. రైతుబంధు పథకం గురించి విశ్లేషిస్తూ మహిళలు వేసిన ముగ్గురు అందర్నీ ఆకట్టుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని తెలిపారు. 62.99 లక్షల మంది రైతులకు రూ. 7,411 కోట్ల నగదు జమ చేశామని స్పష్టం చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రైతుబంధు పంపిణీ చేయగా, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33,452 మంది రైతుబంధు సాయం అందిందని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి పంటలకు మద్దతు ధరలను నిర్ణయించాలి. కేంద్రం పంటలన్నింటినీ మద్ధతు ధరకు కొనాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.