హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ వ్యవసాయరంగం టార్చ్బేరర్గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే, దేశం ఆనుసరిస్తున్నదని చెప్పారు. దేశ, విదేశాల్లో ఎక్కడ వ్యవసాయంపై చర్చ జరిగినా అందులో తెలంగాణ అంశం ఒకటిగా ఉంటుందని, ఇది తెలంగాణ ప్రభుత్వం, రైతులు సాధించిన విజయమని తెలిపారు. శుక్రవారం ‘పదేండ్ల తెలంగాణ వ్యవసాయ ప్రగతి నివేదిక’ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమమే వ్యవసాయ ఇబ్బందుల ప్రాతిపదికన జరిగిందని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో వ్యవసాయ, రైతుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నారని వివరించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆహార సంస్థలు గుర్తించాయని గుర్తుచేశారు. స్వామినాథన్ సైతం తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేశారని, తాను కలలుగన్న వ్యవసాయాభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదని ఆయన పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో సాగురంగం గ్యారంటీ ఉపాధిగా మారిందని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు రూ.73 వేల కోట్లు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని స్పష్టం చేశారు. వివిధ వ్యవసాయ పథకాలకు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వమూ తెలంగాణేనని వెల్లడించారు.
వ్యవసాయం అభివృద్ధి చెందటంతో రాష్ట్రంలోని గ్రామాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయని వివరించారు. సీఎం కేసీఆర్ అప్పగించిన వ్యవసాయశాఖ మంత్రి బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తించానని, రైతులకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేశానని తెలిపారు. అధికారులు నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించారని వెల్లడించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అభినందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు కొండబాల కొటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, కొండూరి రవీందర్రావు, మార గంగారెడ్డి, రజినీ, రాజావరప్రసాద్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణ: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.1.33 లక్షల కోట్ల విలువైన 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. 11,439.06 కోట్లతో ఇతర పంటల సేకరణ జరిగింది.
సాగు నీరు: ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణలో 6 జిల్లాల్లోని మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు. రూ.5,349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి, 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.
రుణ మాఫీ: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొదటి విడతలో 35.31 లక్షల రైతుల రూ.16,144.10 కోట్లు రుణమాఫీ. రెండవ విడతలో ఇప్పటి వరకు 22,98,039 రైతులకు చెందిన రూ.13 వేల కోట్ల రుణాలు మాఫీ. మిగిలిన రైతుల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నది. రెండు విడతలలో కలిపి 58.29 లక్షల రైతుల రూ.29,144.61 కోట్లు రుణమాఫీ.
వ్యవసాయ యాంత్రీకరణ: మొత్తం రూ.963.26 కోట్లతో, 6.66 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు.
గోడౌన్ల సామర్థ్యం: 2014-15లో 39.01 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటే ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు.
పంట నష్ట పరిహారం: పంట నష్ట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1,794.76 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందజేత.
ఆయిల్పామ్ సాగు: ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించటంలో భాగంగా ఆయిల్పామ్ మిషన్ కింద వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల సాగు లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో 1,94,954 ఎకరాలకు చేరిన ఆయిల్ పామ్ సాగు.
వ్యవసాయ విద్యకు ప్రోత్సాహం: తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 11 వ్యవసాయ, ఉద్యాన విద్య కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు.