హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఆలస్యమైనప్పటికీ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదునుగా రైతులు సాగు పనులను ముమ్మరం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక పంట రకాల సాగుపై దృష్టి పెట్టాలని, ఆ దిశగా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల సాగునీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా, రెండుసార్లు వ్యవసాయశాఖ తరఫున సమీక్ష జరిపినట్టు చెప్పారు. శాస్త్రవేత్తల సూచన ప్రకారం కంది, పత్తి పంటల సాగుకు మరో వారం రోజుల వరకు సమయం ఉన్నదని తెలిపారు.
మకజొన్న పంట సాగుకు ఈ నెలాఖరు వరకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు ఈ అదునులో వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. వరి సాగులో స్వల్పకాలిక వరిరకాలపై దృష్టి పెట్టాలని, దీనిమూలంగా పంట ఖర్చులు, సాగు కాలం కలిసి వస్తుందని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించినట్టు వెల్లడించారు. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొకలు నాటడం పూర్తయిందని, 75 వేల ఎకరాల్లో మొకలు నాటేందుకు రైతు లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మంత్రి వివరించారు. ఆయిల్పామ్ రైతులకు రాయితీలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్కుమార్, అగ్రోస్ ఎండీ రాము లు, ఉద్యానశాఖ జేడీ సరోజిని పాల్గొన్నారు.