హైదరాబాద్: యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ఆడిటోరియంలో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న హైఅగ్రిటెక్ సౌత్-2022 సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిటెక్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సన్నకారు రైతులకు ప్రపంచస్థాయి సాంకేతికత చేరవేయాలని సూచించారు.
శారీరక శ్రమ, పెట్టుబడి ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు జరగాలని మంత్రి చెప్పారు. రాబడి పెంపు సవాళ్లను తగ్గించేందుకు సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతుబంధు పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది విడుతలు సాయమందించామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమచేశామన్నారు.