హైదరాబాద్: తొమ్మిదేండ్లలో తెలంగాణ (Telangana) స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులతో రాష్ట్రానికి వరుస కడుతున్నాయని తెలిపారు. అమెరికా (America) పర్యటనలో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో బీఆర్ఎస్ యూఎస్ఎ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్ష్యతన జరిగిన ప్రవాస తెలంగాణ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలన్నారు. 24 గంటల కరెంట్, సాగునీరు, తాగునీరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనతో ముందడుగు వేస్తున్నదని చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, అందుబాటులో విత్తనాలు, ఎరువులతో తెలంగాణ సాగు దశమారిందని వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాలలో వేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ఇస్తున్న అవార్డులే దీనికి నిదర్శనమన్నారు. ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలని చెప్పారు.