కామారెడ్డి జిల్లా : రైతు దేవుడితో సమానమని, తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు అనుసరించాలని సూచించారు.
ఇదే సందర్భంగా బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిప్పులు చెరిగారు. చేతగాంతనంతో ధాన్యం కొనలేమంటూ కేంద్రం చేతులెత్తేసిందని, శాస్త్ర వేత్తల పరిశోధనలను కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏడాదికి రెండు సార్లు కేంద్రమే భూసార పరీక్షలు నిర్వహించాలనే విషయాన్ని కూడా కేంద్ర విస్మరించిందన్నారు.
ఈ నేపథ్యంలోనే సాగు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు రైతులకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. పత్తి, మిర్చి పంటలు ఎక్కువగా సాగు చేయాలని, వరి తప్ప ఏ పంట సాగు చేసినా అధిక లాభాలే ఉన్నాయని తెలిపారు.
ఈ సీజన్ లో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసి రికార్డు సృష్టిస్తామని, మరో మూడేళ్ళలో 10 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చి నిందలు వేసిన ప్రధాని మోదీకి గుజరాత్లో ఉచిత కరెంటు ఇచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. జూటా కోర్ మాటలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు. దేశం మొత్తానికి వర్తించే సమగ్ర విధానం ప్రకటించే దమ్ముందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, బ్యాంకులను మోసం చేసిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ వాళ్లేనని ఎద్దేవా చేశారు. ఆవిర్భావ దినం రోజే అమిత్ షా తెలంగాణ ప్రజల్ని అవమానించారని గుర్తుచేసిన మినిస్టర్.. ఉపాధి హామీని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.