వనపర్తి: చదువులో భాగంగా విద్యార్థులు ఆటలాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసమే పాఠశాలల్లో ఆటలు ఆడిస్తారని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అందులో భాగం కావాలన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదని చెప్పారు. ఒలింపిక్ డే సందర్భంగా వనపర్తి జూనియర్ కాలేజీలో ఒలింపిక్ టార్చ్ను వెలిగించి ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మన ఊరు – మన బడి పథకంతో పాఠశాలల ముఖచిత్రాలు మారిపోతాయన్నారు.
పాఠశాలల్లో వంటగది, మరుగుదొడ్లు, డిజిటల్ క్లాస్ రూంలు, క్రీడా మైదానాలు, విద్యుత్ సౌకర్యం, డైనింగ్ హాళ్లు వంటి వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలనేదే సీఎం కేసీఅర్ ఆశయమని చెప్పారు. క్రీడాకారులకు అన్నివిధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
కాగా, వాలీబాల్ పోటీల్లో దేశం తరపున ఆడిన చిట్యాల తూర్పు తండాకు చెందిన శాంతాకుమారికి సొంతంగా రూ.లక్ష సాయం అందించారు. ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించామని చెప్పారు.