వనపర్తి: కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటక ఫలితాలను చూసి హస్తం పార్టీ నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి జిల్లాలో స్థానం లేదన్నారు. పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్లముందు కనిపిస్తున్నదని చెప్పారు. జడ్చర్ల బహిరంగసభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఐదు దశాబ్దాల పాలనతో పాలమూరును అధోగతి పట్టిందన్నారు. పెండింగుకు పర్యాయపదం కాంగ్రెస్ అని.. ఆ పార్టీ పాలనలో నీళ్లు పెండింగ్, నిధులు పెండింగ్, కరంటు పెండింగ్, పింఛన్ పెండింగ్, పాలన పెండింగ్, ప్రజల సమస్యలు పెండింగ్ అంటూ ఫైరయ్యారు.
పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ల ముందు కనిపిస్తున్నదని చెప్పారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ (CM KCR) పాలన చూసి 2018లో ఉమ్మడి పాలమూరులో 14కు 13 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్కు (BRS) పట్టంకట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పాలకుల సామర్ధ్యానికి గీటురాయి. ఐదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి ఆ పార్టీ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో స్థానం లేదని, వారి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ పండవని చెప్పారు. పార్టీలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించే పవర్ కోసమే పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. హస్తం పార్టీలో అందరూ కట్టప్పలేనని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (Palamuru-Rangareddy Lift irrigation project) మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయ్యిందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ 9 ఏండ్ల పాలనలో పాలమూరు వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని మంత్రి అన్నారు. మండుటెండల్లో కూడా చెరువుల్లో ఉన్న నీరే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అంబలికేంద్రాలు, గంజి కేంద్రాలు ఉండేవని.. నేడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. అధికారం మీద కాంగ్రెస్ దింపుడుకళ్లెం ఆశతో ఉందని విమర్శించారు.