హైదరాబాద్: రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు. శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుందని, దీనికి ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాలక్రమంలో వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకం పెరిగి అనర్థాలకు దారితీస్తున్నాయన్నారు. సహజ ఎరువుల వినియోగం పెంచి, మనం తినే ఆహారంలో సమతుల్యత పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనని చెప్పారు.
భవిష్యత్లో ప్రపంచ ఆహార అవసరాలను తీర్చే శక్తి భారతదేశానికి మాత్రమే ఉందని వెల్లడించారు. వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా ఎదిగేందుకు వ్యవసాయ అనుకూల విధానాలు రావాలని తెలిపారు. రైతు తల ఎత్తుకునే పరిస్థితి లేని దుస్థితి నుంచి నేడు తెలంగాణలో నేను రైతును అని గర్వంగా చెప్పుకోగలిగే స్థాయికి చేరుకున్నామన్నారు. రైతు బంధు పథకం గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.