ఖమ్మం : ఉత్తరాదిలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతుంటే.. తెలంగాణలో మాత్రం రాకెట్ వేగంతో పెరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం నియోజక వర్గం జింకల తండాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్తో కలిసి నూతన గోదాములను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా గోదాములు కట్టడం లేదని, తెలంగాణలోనే నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. 1.50కోట్ల ఎకరాల వ్యవసాయోగ్యమైన భూమి రాష్ట్రంలో ఉందని, 1.46లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్న ఘతన రాష్ట్రానిదన్నారు. 65 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతుబంధు అందుతుందని, 1.48కోట్ల ఎకరాలకు రైతుబంధు అందజేశామన్నారు. దేశంలో సాగుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని, అమెరికాలో 90కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే భారత దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ అనుకూలంగా ఉందన్నారు.
చైనా, అమెరికాలో ప్రపంచ దేశాలు దేశాలకు అన్నం పెట్టలేవని.. ప్రపంచానికి అన్నంపెట్టే స్థితిలో భారతదేశం ఉందన్నారు. దేశ యువతకు రాబోయే రోజుల్లో ఆహారరంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు. ఖమ్మం జిల్లాలోనే కష్టపడే రైతులు ఉన్నారన్నారు. తెలంగాణ ఉత్పత్తులే రాబోయే రోజుల్లో కీలకం కాబోతున్నాయన్నారు. ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతను నిలబెట్టింది సీఎం కేసీఆర్ అన్న విషయం ఎవరూ మరిచిపోవద్దన్నారు. డిసెంబర్ నెలలో యాసంగి పంటకు రైతుబంధు సాయం అందిస్తామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంటను రైతులు దాచుకునే వెలుసులుబాటు లేదని, దానికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గోడౌన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. జిల్లా రైతులు వైవిధ్యమైన వ్యవసాయం చేయడంలో ముందుంన్నారన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలతో స్వేచ్ఛగా పండిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి, లాభాలు గడించాలని సూచించారు. సాగునీరు అందించడంతో రైతులు, గ్రామస్తులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై గ్రామంలో సమావేశాలకు, సభలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. మానవ జీవన మనుగడకు నీరే మూలాధారమని.. నీటిని ఒడిసిపట్టే పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.