హైదరాబాద్ : రైతుల కోసం నిలబడేది టీఆర్ఎస్సేనని.. కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు మాట్లాడారని, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం కేంద్రానికి సహకారం అందిస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్సీఐ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లయ్శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదన్నారు. వాళ్లు బియ్యం తీసుకుపోకుండా పంపలేదని రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.
రా రైస్, బాయిల్డ్ రైస్కు తేడా తెల్వని వాళ్లు ఎంపీలవడం దురదృష్టకరం
రా రైస్, బాయిల్డ్ రైస్కు తేడా తెలియని బీజేపీ నేతలు.. ఎంపీలు కావడం మన దురదృష్టకరమన్నారు. బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్న ఎఫ్సీఐ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పారాబాయిల్డ్ బియ్యమేనన్నారు. ఇప్పుడు వందశాతం బియ్యం సేకరించమనడం దుర్మార్గమన్నారు. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదన్నారు.
రైతుల కోసం పోరాడుతున్నది టీఆర్ఎస్సే
దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రైతుల పక్షాన కొట్లాడకుండా చేతులెత్తేసిందని మంతి విమర్శించారు. వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారని, తెలంగాణ రైతుల కోసం పార్లమెంట్లో, బయటా పోరాడుతున్నది టీఆర్ఎస్సేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. కేంద్రం విధానాలను గమనించే పంటల మార్పిడిని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 10లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారని, దీన్ని భవిష్యత్లో 20లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
యాసంగిలో వరి సాగు చేయొద్దు
ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలుండాలని, కానీ కేంద్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తుందన్నారు. వ్యవసాయం ఉజ్వలంగా, సంతోషంగా ఉండాలని కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతు పంట కోసం కష్టపడినట్లే రైతుల బాగు కోసం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
యాసంగిలో రైతులు వరి సాగు చేయొద్దని మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. ప్రభుత్వం ఎలాంటి కొనుగోలు కేంద్రాలు చేయదని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.