జోగుళాంబ గద్వాల : వెనుకబడిన ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని విజయవర్ధనే ఆయిల్ మిల్లు ప్రాంగణంలో రూ.200 కోట్లతో రాష్ట్ర ఆయిల్ఫెడ్ సంస్థ నిర్మిస్తున్న పామాయిల్ కర్మాగార పనులకు మంగళవారం మంత్రి నిరంజన్రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు పండడంతో 2003లో 95 ఎకరాలోల విజయవర్ధనే ఆయిల్మిల్లు ఏర్పాటు చేయగా, ఆంధ్రా పాలకుల దాష్టీకానికి అనతికాలంలోనే ఫ్యాక్టరీ మూతపడిందని గుర్తుచేశారు. ఆ ఫ్యాక్టరీని ఆంధ్రా పాలకులు అమ్మకానికి పెడితే.. తాము ఉద్యమం చేస్తే వెనక్కి తగ్గారన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో ఎన్డీడీబీకి ఆయిల్మిల్లు అప్పుగా ఉన్న రూ.36 కోట్లలో వన్టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం రూ.8.42 కోట్లను చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగువైపు రైతులను ప్రోత్సహిస్తున్నదన్నారు. రైతులకు ఎకరాకు రూ.50,900ను సబ్సిడీ కింద ఇస్తున్నదన్నారు. ఈ పంట సాగులో దేశంలో తెలంగాణనే నంబర్వన్లో ఉందన్నారు. వరి, గోధుమ సాగులో స్వామినాథన్ కొత్త వంగడాలను సృష్టించారన్నారు.
మన శాస్త్రవేత్తలను ప్రపంచం మెచ్చుకుంటే మనం మాత్రం గౌరవించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నడిగడ్డలో ఏర్పాటుకానున్న కర్మాగారంలో గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేయొచ్చని పేర్కొన్నారు. పంటసాగు పెరిగే కొద్దీ క్రషింగ్ సామర్థ్యం పెంచుకోవచ్చాన్నారు. కర్మాగారం ఏర్పాటుతో ప్రత్యక్షంగా 400, పరోక్షంగా 1400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
టెక్నికల్ ఉద్యోగులు తప్పా అందరిని ఈ ప్రాంతం వారినే నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో పామాయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఆయిల్ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యానవన శాఖ అదనపు కమిషనర్ సరోజిని, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.