వనపర్తి రూరల్ : యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పండిన ప్రతి గింజనూ కొంటామని భరోసానిచ్చారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దళారుల మాటలను నమ్మొద్దని, కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. ఈసారి వనపర్తి జిల్లాలో 1,82,963 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 5.24 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అంచనా వేసినట్లు తెలిపారు. వడ్లను బాగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకొస్తే తరగు సమస్య ఉండదన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపీ, పీఏసీసీఎస్, ఏఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కేంద్రాలకు తరలించిన ధాన్యం అకాల పరిస్థితుల్లో నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. యాసంగి సీజన్కు సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. వరితోపాటు పాటు నూనె, పప్పు దినుసుల, ఇతర పంటల సాగుకు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.