వనపర్తి, డిసెంబర్ 16 : ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 232 మందికి రూ.2.32 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 205 మందికి రూ.64.28 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు లబ్ధిదారులు, బాధితులతో కలిసి మంత్రి సహపంక్తి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. గడప గడపకూ సంక్షేమం.. వాడవాడలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
అనారోగ్యంపాలైన బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సాయం చేస్తున్నట్టు చెప్పారు. సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ను ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుకు పోరాడుతామని తెలిపారు. రైతు రాజ్యస్థాపనకు బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తున్నదని చెప్పారు. అనంతరం సంగం ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. జీఎస్టీ విధించి మోదీ సర్కార్ నేతన్నల నడ్డి విరిచిందని ఆరోపించారు. తెలంగాణ నుంచి ప్రధాని కార్యాలయానికి పోస్ట్ కార్డుల ద్వారా వినతులు పంపినా చలనం లేదని ధ్వజమెత్తారు.