హైదరాబాద్ : భారీ వరదల కారణంగా కాళేశ్వరం పంప్హౌస్లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు ఇంజినీర్ పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును నెహ్రూ, శ్రీశైలం ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి, పోతిరెడ్డిపాడును వైఎస్సార్ కట్టారంటారని.. కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ గురించి మాత్రం మాట్లాడరని ఆరోపించారు. నీటి లభ్యత ఉన్నచోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, ఇంజినీరింగ్ మహాఅద్భుతం అని ప్రపంచం కీర్తిస్తోందన్నారు. 500 ఏళ్లకోసారి వచ్చే వరదలని సీడబ్ల్యూసీ ప్రకటించిందని, 28లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా కాళేశ్వరం నిర్మాణం చేపట్టామన్నారు.
సాంకేతికంగా ఏ లోపం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని మంత్రి స్పష్టం చేశారు. వరదలో పంప్హౌస్లు మునిగితే ప్రభుత్వానిది తప్పంటారా? అని ప్రశ్నించారు. 1998, 2009లో శ్రీశైలం మునిగిపోలేదా? అని నిలదీశారు. జూరాల ప్రాజెక్టు నీటి లభ్యత ఉన్న చోటే కట్టారా? అంటూ అనీ, నీటిరంగ నిపుణుడు పెంటారెడ్డిని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా? అని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు 180పైగా కేసులు వేశారన్నారు. తెలంగాణలో కృష్ణా నదిపై మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఏడాదిన్నరలో పాలమూరు – రంగారెడ్డిని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.