హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది కదా? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిరంజన్ రెడ్డి ధీటైన సమాధానం ఇచ్చారు.
మోదీ ఏమైన రావణాసురుడా?? ఆయనకు నూరు తలకాయలు ఉన్నాయా? ఎందుకు భయపడుతాం. మేం ఏ తప్పు చేశాం. మా రాష్ట్ర రైతాంగానికి సరిపడా సాగు నీటిని ఇచ్చి తప్పు చేశామా? 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏండ్లలో పూర్తి చేసి వారి కితాబులను పొందినందుకు భయపడుతామా? మోదీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. మోదీకి దేనికి భయపడాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగినప్పుడే ఇంత కంటే ఎక్కువగా దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారు. భయపెట్టారు. వాటన్నింటిని ఖాతరు చేయలేదు. మోదీకి కాదు దేవుడికి కూడా భయపడం. బరాబర్ చెప్తున్నాం.. భయపడే ప్రసక్తే లేదు. మాకేం కర్మ భయపడడానికి. అదానీ, అంబానీలకు బొగ్గు గనుల ఒప్పందం చేయించామా? బ్యాంకుల ఎగవేతదారులకు పక్కనుండి వీసాలు ఇప్పించి విదేశాలకు పంపించామా? దేశ ప్రజల ఆస్తులను ప్రయివేటు వాళ్లకు ఏమైనా అప్పజెప్పామా? మేం ఎందుకు భయపడుతామని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.