హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బండి సంజయ్కు దమ్ముంటే ఉద్యోగ ఖాళీలపై కేంద్రాన్ని నిలదీయాలి అని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్థం పర్థం లేకుండా నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలని బండి సంజయ్ దీక్ష చేస్తుండు. ఈ ఏడుపేదో నువ్వు ఢిల్లీ వెళ్లి ఏడువు. కేంద్రం పరిధిలో 8 లక్షల 72 వేల 243 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీకు దమ్ముంటే ఉద్యోగ ఖాళీలపై కేంద్రాన్ని నిలదీసి నోటిఫికేషన్లు ఇప్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చింది. మిగతా ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మీ గొప్పతనంతో కేంద్రం నుంచి 50 నుంచి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తే బాగుంటుంది.
2020 మార్చి 1 నాడు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్రంలో ఉద్యోగుల సంఖ్య 40 లక్షల 4 వేల 941 ఉద్యోగాలు. మార్చి, 2020 నాటికి 31 లక్షల 32 వేల 698 మంది మాత్రమే పని చేస్తున్నారు. 8 లక్షల 72 వేల 243 ఖాళీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కొలువుల భర్తీ కోసం ఒక్కనాడైనా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీశారా? ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ఏనాడైనా ఆందోళన చేపట్టిందా? పేరుకే కాంగ్రెస్ జాతీయ పార్టీ కానీ.. బీజేపీని ఎక్కడ నిలదీయారు. పెట్రోల్, డీజిల్ ధరలు అపరిమితంగా పెంచుకుంటే పోతే ఒక్కనాడు కూడా ప్రశ్నించలేదు అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.