వనపర్తి టౌన్, జూలై 25: ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తిలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ తీసుకొంటున్న 550 మంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పీ రంజన్త్రన్కుమార్తో కలిసి మంత్రి ఉచిత మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. 60 రోజుల శిక్షణ పూర్తయిందంటే అభ్యర్థులు మొదటి మెట్టు ఎక్కినట్టేనని అన్నారు.
గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం మొదటి ప్రయత్నంలో సఫలీకృతం కాలేదని, మొండి పట్టుదలతో చదివితే విజయతీరాలను చేరుతారని సూచించారు. డీజీపీ మహేందర్రెడ్డి ప్రభుత్వ బడుల్లో చదివి ఐపీఎస్ సాధించారని, పేదరికం నుంచి ఉన్నత ఉద్యోగం సాధించారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు జీవితంలో స్థిరపడేవరకూ తోడుంటామని, ఉద్యోగాలు సాధించడమే వారు తమకిచ్చే బహుమతి అని పేర్కొన్నారు.