పెబ్బేరు, మే 10 : కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడంతో నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని పెబ్బేరులో నిర్వహించారు. అలాగే రైతుబంధు ప్రకటించి ఐదేండ్లు పూర్తయినందున పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి కేక్ కట్చేశారు. 9 ఏండ్లలో వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు అంటే నాడు పేదరికం.. వలసలకు కేరాఫ్గా ఉండేదని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఎంతో ప్రగతి సాధించిందని చెప్పారు. ఆకలి తీర్చేందుకు నాడు గంజి కేంద్రాలు ఉండేవని, నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 9 ఏండ్లలో ఎన్నో సాగునీటి పథకాలను ప్రారంభించి కొత్త ఆయకట్టుకు నీటిని పారించామని, దీంతో నేడు ఏ గ్రామంలోనూ ఎకరం భూమి ఖాళీగా కనిపించడం లేదని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకుల కండ్లు మండుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉండాలని కోరారు.