హైదరాబాద్ : యాసంగిలో రైతులు వరి సాగు చేయొద్దని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. విత్తన వడ్లు సాగు చేసే రైతులు మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటే నిరభ్యంతరంగా సాగుచేసుకోవచ్చని అన్నారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం రైతులు వరి సాగు చేపట్టొద్దని.. తెలంగాణ ప్రభుత్వ విధానపర నిర్ణయమన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. వానాకాలంలో వరి సాగుపై ఎలాంటి వర్రీ అవసరం లేదన్నారు. ఎఫ్సీఐ కొనకున్నా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. దొడ్డు వడ్లయినా.. సన్న రకాలయినా ప్రభుత్వం కొంటుందన్నారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం నానా యాగీ చేస్తుందని మంత్రి ఆరోపించారు. కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్రాల మీద నెట్టివేస్తుందని ఆరోపించారు. యాసంగిలో నూక శాతం ఎక్కువ ఉంటుంది.. నూక లేని వరివంగాడల అభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు. యాసంగి సాగును ఒక నెల ముందుకు జరుపుకోవాలని రైతులకు సూచించారు.
రైతులపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, సీఎం కేసీఆర్ నిండు మనసుతో వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దారని.. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణలో దిగుబడి అవుతున్న పంటలన్నారు. కష్టపడి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని.. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్నామని.. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో 1.41లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. 62.8లక్షల ఎకరాల్లో వానాకాలంలో వరి సాగైందని తెలిపారు. నాలుగైదు నెలలుగా వరి సాగులో ఇబ్బందులను రైతుల దృష్టికి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విపక్షాలు రైతులను రెచ్చగొట్టి రాజకీయం లబ్ధికోసం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
రైతాంగం విపక్షాల చేతుల్లో పావులుగా మారొద్దని.. వానాకాలం పత్తి సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశామన్నారు. కానీ, అనుకున్నంతగా రైతాంగం పత్తి సాగు చేయలేదన్నారు. ఇవాళ పత్తికి సీసీఐ మద్దతు ధరకు మించి ఎక్కువ ధర పలుకుతుందన్నారు. కోటి ఎకరాలలో పత్తి సాగు చేసినా రైతులకు మద్దతు ధర దక్కుతుందన్నారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నదన్నారు.
వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో అపోహాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గతేడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న ధాన్యంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్ద మూలుగుతున్నది.. కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి ఓ విధానం లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం చెప్పేది అబ్ధమైతే యాసంగి కొనుగోళ్లు చేస్తామని బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. భారత ఆహార రంగాన్ని కార్పోరేట్లు, ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకుంటున్నది ఆరోపించారు. కామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఈ సంఘటనపై నివేదిక తెప్పించుకుందన్నారు.