Minister Prashath Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామంతో పాటు పలు తండాల్లో మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రి మానాల గ్రామం, తండా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి చివరిగ్రామమైనా మానాలను సొంత గ్రామంతో సమానంగా చూస్తానన్నారు. ఇక్కడి ప్రజలు కల్మషం లేని ప్రేమ తనకు ఎంతో ఇష్టమన్నారు.
762 మానాల గిరిజన కుటుంబాలకు 1,750 ఎకరాలు పోడు పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇకపై నుంచి మీ భూములకు మీరే రారాజులన్నారు. లంబాడీలు అంటే తనకు అత్యంత ఇష్టమని లంబాడీలు అబద్ధాలు ఆడరున్నారు. ఒక్క ఊరిలో రూ.100కోట్లకుపైగా అభివృద్ధి పనులు జరిగాయని, మానాల ప్రజలను అంతా తన కుటుంబ సభ్యుల్లాగే చూశానన్నారు.
ఒకే గ్రామంలో కుల సంఘాల భవనాలకు రూ.1.27కోట్లు కేటాయించామన్నారు. 16 తండాలు ఉంటే 4 గ్రామ గ్రామ పంచాయతీలుగా అధికారులు ప్రపోజల్ చేస్తే.. గిరిజన ప్రజల అభీష్టం మేరకు తాను ఎనిమిది పంచాయతీలు చేయించానన్నారు. తీజ్ పండుగకు మహిళకు తీజ్ భవనాలు, సేవాలాల్ భవనం ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఇచ్చామన్నారు. కొందరికి గృహలక్ష్మి పథకం వర్తింజేస్తున్నామని, వచ్చే సారి మరికొంత మందికి ఇస్తామన్నారు. గిరిజన ప్రజల చిరకాల కోరికలను సీఎం కేసీఆర్ దయతో నెరవేర్చానని అన్నారు. మానాల గ్రామ, తండాల ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కు, తనకు ఉండాలన్నారు. రాబోయే రోజులు మానాలను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.