మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సైదోనిగడ్డ తండాలో శనివారం జరిగిన గిరిజన దినోత్సవం (Tribals Day)లో ఆయన పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. భోగ్బండార్ పూజ కార్యక్రమంలో పాల్గొని తీజ్ మొక్కలకు పూజ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకోక పోవడం వల్ల వారు వెనుకబాటు గురయ్యారని అన్నారు. దశాబ్దాలుగా అణిచివేత, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అని అన్నారు. గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా తండాలను గ్రామ పంచాయతీలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ (Reservations) పెంచి గిరిజన జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. గిరిజనులు వృద్ధిలోకి వచ్చే విధంగా గిరిజన విద్యాలయాలు ఏర్పాటు చేసి ఉన్నత చదువులు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ(Tribal Versity) ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో జరగని అభివృద్ది తొమ్మిదేండ్లలో గిరిజనుల అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. గిరిజనుల ఆత్మగౌరవానికి అద్దం పట్టెలా బంజారాభవన్ నిర్మించిందని స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి, జడ్పీటీసీలు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.