శామీర్పేట : ప్రజలను నమ్మించి, మోసగించి ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవని , అటువంటి వ్యక్తి ఓట్ల కోసం వస్తే నిలదీయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డితో పాటు మరికొందరు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ పనిచేసినోడికే ఓటు అడిగే హక్కు ఉందని ఇచ్చిన మాటను ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కే ఆ హక్కు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానిదే హాట్రిక్ విజయం అన్నారు. గోడల మీద పేర్లు కాదు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే వారే నిజమైన లీడర్ అని పేర్కొన్నారు. మూడు పంటలకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుంటే రేవంత్ 3 గంటల కరెంటు సరిపోతుందని అంటున్నాడని ఎద్దేవా చేశారు.
తొమ్మిది సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. సాగునీరుకు కరెంటు ఉండేది కాదని, తాగునీళ్ల కోసం కిలో మీటర్ల దూరం బిందెలతో ఆడపడుచులు వెళ్లేవారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు పక్కన బెట్టి ప్రజాక్షేత్రంలో వచ్చి దమ్ముచూపించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో మరిచిపోయి కూడా బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు వేయవద్దని కోరారు. ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ పరిస్థితి అధోగతి అవుతుందని వెల్లడించారు.
గృహలక్ష్మి (Grihalaxmi) పథకం ఈ నెలలోనే రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.