హైదరాబాద్: మనం ఎంత కష్టపడితే అంత గొప్పవాళ్లమవుతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మికుల శ్రమతోనే కంపెనీలు నడుస్తున్నాయని చెప్పారు. కార్మికులను అగ్రభాగానికి తీసుకెళ్లే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు.
కార్మికుల శ్రేయస్సు కోసం ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. కార్మికుల పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేశామని, మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్య అందిస్తున్నామని చెప్పారు. పిల్లలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
గతంలో జరిగిన మే డేలు వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న మే డే వేడుకలు వేరన్నారు. కరోనా సమయంలో వలస కార్మికులు, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని గుర్తుచేశారు. తిండి, వైద్యం అందించిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ఉందదని వెల్లడించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకపోవడంతో పరిశ్రమలు నడుస్తున్నాయని, కార్మికులకు పని దొరుకుతుందని చెప్పారు.