వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తే తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాలు విసిరారు. అవసరమైతే రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతానని స్పష్టం చేశారు. బీజేపీ అంటేనే ఝూటా కోర్ పార్టీ, కాంగ్రెస్ అంటే దొంగల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. కౌరవుల వంటి బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించి సీఎం కేసీఆర్ను ప్రధానిని చేయాలని భద్రకాళి అమ్మవారిని మొక్కుకొన్నట్టు తెలిపారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని తార గార్డెన్స్లో నిర్వహించిన సదస్సులో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తున్నదని విమర్శించారు. దేశాన్ని దోచుకొన్న దొంగలు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారికి కొమ్ముకాస్తున్నదని మండిపడ్డారు. మోదీ అంటేనే మోసాలు, నంబర్ వన్ కేడీ అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ పాలన ఖతం కరో అంటున్న ప్రధాని మోదీ తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ కొత్త బిచ్చగాడు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొత్త బిచ్చగాడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఇస్తున్న హామీలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దసరా నుంచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని చెప్పారు. కేసీఆర్ దేశ్కీ నేత కావడమూ ఖాయమన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిరిగానే కేంద్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
కార్మిక పక్షపాతి కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవని, మరికొంత మందికి ఉపాధి లభించేదని, ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు కుట్ర చేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. వివిధ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్కు కార్మికులంతా అండగా నిలువాలని కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని ఆరోపించారు. సదస్సులో ఎంపీ పసునూరి దయాకర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.