హైదరాబాద్: తెలంగాణలో గంగా జమున తెహజీబ్ కొనసాగుతున్నదని మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సెక్యులర్ తెలంగాణ కొనసాగుతున్నదని చెప్పారు. ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటుచేశామన్నారు. పేద ముస్లిం ఆడబిడ్డలకు షాదీ ముబారక్ ఒక వరమని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మైనార్టీ నేతలతో కలిసి మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందిస్తున్నామన్నారు. 3 వేల మంది విద్యార్థుల విదేశీ విద్యకు సహాయం చేశామని తెలిపారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.20 లక్ష స్కాలర్షిప్ ఇస్తున్నామన్నారు. ముస్లింలలో వృత్తిదారులకు రూ.లక్ష మైనార్టీ బంధు సాయం అందిస్తున్నామని వెల్లడించారు.
మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే అనేక రెట్లు ఎక్కవ బడ్జెట్ అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందుతున్నాయని చెప్పారు. కులం, మతం చూడకుండా అన్నివర్గాలకు ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. అన్ని మతాలవారి పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు.