మొయినాబాద్ : రానున్న సాధారణ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తామని భూగర్భవనరుల , సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి (Minister Mahender Reddy ) అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత తొలిసారిగా మొయినాబాద్కు రావడంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు శుక్రవారం ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అన్ని వర్గాలకు సముచితంగా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోనికి రావాలంటే అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా కష్టపడి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూఫ్ తదితరులు పాల్గొన్నారు.