Mahender Reddy | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. గనులు,భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయం అని పేర్కొన్నారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 అధికారులు, సిబ్బందిని భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సాంకేతికను అనుసంధానం చేసి గనులు,భూగర్భ వనరుల శాఖను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామన్నారు. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్లైన్ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. టీఎస్ఎండీసీ సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం అభినందనీయం అని అన్నారు. గత ఏడేళ్ల కాలంలో రూ.5,444 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చిందని తెలిపారు. రాష్ట్రంలో 101 ఇసుక రీచ్ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ నివారణను అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తదితరాలకు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు వ్రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.