హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించడంతో బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది’.. అని తేల్చి చెప్పారు.
‘బీఆర్ఎస్ అంటే భారత ‘రైతు’ సమితి జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది.
కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా బీజేపీ సరారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం
రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం
రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం.. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ.. ఒక తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిది’.. అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ ముగించారు.