హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. ఈ నెల 16న జరిగే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నప్పటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రజల కలగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో ఆ కల నెరవేరుతున్నందుకు తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు ఆకుపచ్చని సిరులతో తులతూగబోతున్నాయని తెలిపారు. గతంలో ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేదని, నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు సంబురంగా ఉన్నదని అన్నారు. గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డిలాంటి గొప్ప ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తవుతాయని తెలిపారు.
తీరిన ప్రజల కష్టాలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడామని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘పాలమూరు, రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది. అనేక అడ్డంకులను దాటుకొని సీఎం కేసీఆర్ పట్టుదలతో పూర్తయి న ప్రాజెక్టు ఇది’ అని చెప్పారు. రైతుల పొలాలకు సాగునీరు, రాజధాని ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి అవసరాలు పాలమూరుతో తీరనున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు విశిష్ఠతను ప్రతి ఒక్కరికీ తెలిసేలా కార్యాచరణ ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న కనీ సం లక్షన్నర రైతులతో ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభ నిర్వహించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించిన కేటీఆర్.. సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకోవాలని కోరారు. సమీక్షలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఇతర ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు సందీప్కుమార్ సుల్తానియా, రఘునందన్రావు, ఈఎన్సీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.