Minister KTR | హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరీకి లేఖ రాశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్రం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రోరైల్ ప్రాజెక్టులు ఇస్తున్న విషయాన్ని లేఖలో కేటీఆర్ ఎత్తిచూపారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు చాలా తకువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ ఉత్తరప్రదేశ్లోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. జనాభా రద్దీ తకువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్కు అన్ని అర్హతలు ఉన్నాయని పేరొన్న కేంద్రం, హైదరాబాద్ నగరానికి మాత్రం మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
హైదరాబాద్ నగర ట్రాఫిక్ రద్దీ సరిపోదనడం అర్థరహితమని కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా హైదరాబాద్ ఉన్నదని, ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తకువగా ఉండే అవకాశం ఉందన్న వాదనను కొట్టిపడేశారు. యూపీలోని అనేక చిన్ననగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టుకు అర్హత సాధించినప్పుడు.. హైదరాబాద్ మెట్రోనగర్ ఎందుకు అర్హత పొందదని మంత్రిని నిలదీశారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృక్పథంతో తీసుకున్న నిర్ణయమేనన్న భావన కలుగుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్న వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేకసార్లు సీఎం కేసీఆర్, స్వయంగా తాను కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణతో పోల్చుకుంటే ఎలాంటి అర్హతలు లేకున్నా ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణకు పదేపదే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాత దృక్పథమేనని, కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతో పాటు డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (DPR) సైతం అందించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్డీటీ గణాంకాలు, ఇతర అర్హతలను, సానుకూలతలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ తరఫున గతంలో అందించిన సమాచారం తాలూకు నివేదికలను ఈ సందర్భంగా కేటీఆర్ జతచేశారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను వివరించేందుకు తాను స్వయంగా అనేకసార్లు ప్రయత్నించినా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగర మౌలిక వసతుల ప్రాజెక్టులు విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించిన్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.