స్వతంత్ర భారతదేశంలో చేనేతపై పన్నువేసిన మొదటి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ టెక్స్టైల్రంగంపై మోదీ పన్నుల భారం వేశారని మండిపడ్డారు. మోదీ నిర్ణయాలవల్లే టెక్స్టైల్ రంగం కునారిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా టెక్స్టైల్ రంగానికి కేటాయింపులు చేస్తున్నది తెలంగాణ సర్కారే అని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా యార్న్ సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తమదేనని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక పొదుపు పథకంతో నేతన్నకు చేయూతనిస్తున్నామని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం వచ్చాకే నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ముంబై, బీవండి, సూరత్ నుంచి తెలంగాణకు నేతకార్మికులు తిరిగివస్తున్నది నిజంకాదా? అని అడిగారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో ఏ నేతన్నను అడిగినా చెబుతారన్నారు. కేంద్రం బీమా ఎత్తివేస్తే.. తాము ప్రత్యేకంగా నేతన్నకు బీమా కల్పిస్తున్నామని చెప్పారు. నేతన్నలకు ఉన్న బీమాను ఎత్తివేసిన కేంద్రం నిర్ణయంపై బండి సంజయ్ మాట్లాడాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్రంనుంచి అందిన సాయంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ అడిగారు. నేతన్నలపై బండి సంజయ్కి నిజంగా ప్రేమ ఉంటే పార్లమెంట్లో ప్రత్యేక సాయంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుపై బండి సంజయ్ ఢిల్లీలో కొట్లాడాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.