హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ అమలుచేస్తున్న విధానాలవల్లే నేడు దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, నిరుద్యోగ సమస్య ప్రబలిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమైనప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు సాధ్యంకావని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి మాడలే బీఆర్ఎస్ ఎజెండా అని, కేంద్రం వైఫల్యాలు, తెలంగాణ సాధించిన విజయాలను దేశ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దావోస్ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కేటీఆర్.. ఇండియా టుడేతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.
గత అక్టోబర్లో తొమ్మిదిరోజులు తెలంగాణ డెఫిసిట్లో ఉన్నట్టు ఇటీవల ఆర్బీఐ బులెటిన్లో వెల్లడించింది.. కారణం?
కేంద్రం డెఫిసిట్ గురించి ఎందుకు మాట్లడరు? కేంద్రం రూ. 100 లక్షల కోట్ల వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడరు? ఆర్బీఐ ఎవరికింద పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఆర్బీఐ ఏమి రాస్తుందో అందరికీ తెలుసు. ప్రభుత్వ సంస్థలను గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది. సీబీఐ, ఐటీ, ఈడీ, ఆర్బీఐ తదితర ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నవాళ్లు ఇచ్చే ఉపన్యాసాలు మాకు అవసరంలేదు. కేంద్రం కన్నా, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలకన్నా ఎంతో మెరుగ్గా తెలంగాణలో పాలన నడుస్తున్నది.
ఆర్థిక వ్యవహారాల గురించి చెప్తూ కేంద్రంపై కత్తి దువ్వుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భం గా ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేస్తున్నారు?
గతంలో ఎన్నడూ చూడని అత్యంత అసమర్థ ప్రధాని మోదీ. దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీస్థాయి ద్రవ్యోల్బణం ఏర్పడడానికి, నిరుద్యోగం పెరగడానికి ఆయనే కారణం. ఆయన నిర్ణయాల వల్ల నేడు దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నది. నిరుద్యోగం పెరిగిపోయింది.
ద్రవ్యోల్బణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలున్నాయి కదా?
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి పతనం గురించి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఎటువంటి మాటలన్నారో మీరు రికార్డులు తీసి చూసుకోండి. అప్పుడు ఆయన మాట్లాడింది ఒప్పైనప్పుడు ఇప్పుడు మేము మాట్లాడుతున్నది తప్పెలా అవుతుంది? కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ రూ.60గా ఉండేది. అప్పట్లో ఇదే మోదీ కేంద్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం ఉందని ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది కేంద్రంలో. గత ఎనిమిదేండ్లుగా అధికారంలో మీరే ఉన్నారు కదా. ఇప్పుడు అసమర్థ, అవినీతిపరులు ఎవరు ? మోదీ ప్రధాని అయినా ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు. ఇది నేనంటున్నది కాదు. ఇతరులకు నీతులు చెప్పేముందు మనది కూడా చూసుకోవాలి. దేశంలో 15 మంది ప్రధానుల్లో ఇంతటి అసమర్థ ప్రధాని మరొకరు లేరు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు. కొవిడ్కన్నా ముందు ఎనిమిది త్రైమాసికాలను పరిశీలిస్తే, దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తూ వచ్చింది. మోదీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్ నుంచి ఏకంగా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్లకు చేరుకుంది. అయినా మనది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ పతనం కొనసాగుతున్నది కదా.. దీని ప్రభావమే మన దేశంలో కూడా ఉందనుకుంటా?
అంటే.. గతంలో మోదీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు మన దేశంపై ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఏమీ లేదా? ఇప్పుడే ప్రపంచ పరిస్థితుల ప్రభావం ఉందా? అప్పట్లో ఉన్నది అసమర్థ ప్రభుత్వం అయితే మరి ఇప్పుడున్నది సమర్థ ప్రభుత్వమా? అంటే వారికో నీతి మీకో నీతా?
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితర విపక్ష నేతలతో కలిసి పెద్ద ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు?
మా మెసేజ్ చాలా స్పష్టంగా ఉన్నది. దేశంలో ఏం జరుగుతున్నదో ప్రజలకు తెలుపుతాం. ఒక విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. 1987లో భారత్, చైనాలు ఒకే సైజు ఆర్థిక వ్యవస్థలుగా ఉండేవి. నేడు చైనా ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్లు కాగా, భారత ఆర్థిక వ్యవస్థ కేవలం మూడు ట్రిలియన్లు మాత్రమే. ఎక్కడ తప్పు జరిగింది. మంచి కలలు కనొచ్చు, తియ్యటి మాటలు చెప్పొచ్చు. 2014 తరువాత మ్యాజిక్ అయిపోతుందని.. దేశంలో అమెరికా మాదిరి అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. అమెరికన్లే భారత వీసా కోసం క్యూకడతారని నమ్మించొచ్చు. కానీ.. నేడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర ఏ రంగం తీసుకున్నా మన దేశం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఏ విషయం తీసుకున్నా తిరోగమనమే. ప్రపంచంలో మన స్థానం ఎక్కడుంది? ఓట్లకోసం జనాన్ని చీల్చే విధానాలతో దేశాభివృద్ధి సాధ్యంకాదు. అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. తోటి రాష్ర్టాలకు తెలంగాణ అభివృద్ధిని, విజయగాథలను గురించి వివరిస్తాం. తెలంగాణ 15 శాతం పెరుగుదల సాధించినప్పుడు, తెలంగాణలో ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగేండ్లలోనే నిర్మించినప్పుడు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కావడంలేదు. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, సంపద సృష్టి తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తూ ఈ సమస్యలన్నీ వదిలి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాగేశ్, ముస్లింలు, మైనారిటీలను బూచిగా చూపించి, వాళ్లను శత్రువులుగా చిత్రీకరించి ఓట్లు దండుకునే పద్ధతి కొనసాగుతున్నది. ఇది పూర్తిగా తప్పు. ఇందులో ఎటువంటి దేశ హితం లేదు.
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్నది కదా, దీనికేమంటారు?
మన బేస్లైనే చిన్నగా ఉన్నప్పుడు ఫాస్ట్గానే పెరుగుతుంది. మన బేసే తప్పుగా ఉంది. అందుకే ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్నది. అంకెల గారడీ చూపించి ప్రజలను తికమక పెట్టాలనుకుంటే అది సాధ్యంకాదు. కొందరు వారి మాటలను నమ్మొచ్చు కానీ మాలాంటివాళ్లం దేశానికి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాం. వారు చెప్తున్న లెక్కలు తప్పని వివరిస్తాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో మన ర్యాంకు మోదీ అధికారంలోకి రాకముందు 88 ఉండగా, నేడు 107కు దిగజారింది. ఏ ఒక్క ఇండెక్స్లో అయినా మన దేశ ప్రదర్శన మెరుగ్గా ఉందా చెప్పండి. ఆహార భద్రత గురించో, ఇంకో విషయం గురించో కథలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ హయాంలో రూపాయి విలువ ఎన్నడూ లేనివిధంగా పతనమైంది. నేడు డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 82కి చేరింది.