హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులందరూ కలిసి రావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సమయంలో మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారై శాఖల ప్రతినిధులతో శనివారం కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన తర్వాత రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు అవసరముందనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. గొప్ప చదువులు చదివి విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులంటే గ్రామాల్లో చాలా గౌరవభావం ఉందని, వారు చెబితే ఓటర్లు వింటారని పేర్కొన్నారు.
రానున్న 30 రోజులు ఎంతో కీలకమని తెలిపారు. దారితప్పి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. గతంలో తెలంగాణ అనుభవించిన కష్టాలను, ప్రస్తుతం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలను చైతన్యం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.