వరంగల్ : ఈ నెల 7న మంత్రి కేటీ వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ మహానగర కమిషనర్, సీపీ, ఇతర అధికారులతో సమావేశమై కేటీఆర్ పర్యటన, ఏర్పాట్ల పై చర్చించారు.
వరంగల్ వరంగల్ పర్యటన సందర్భంగా కేటీఆర్, ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కైటెక్స్ మెగా టెక్ట్స్టైల్స్ పార్క్ కు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు. అలాగే, గణేష్ టెక్ట్స్టైల్స్ ఇండస్ట్రీస్ ను ప్రారంభిస్తారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ హనుమకొండలోని పీజేఆర్ గార్డెన్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్ అవుతారు. ఈ సందర్భంగా ఐటీ రంగం, ఐటీ కంపెనీల విస్తరణ, అవకాశాలు, ఉపాధి వంటి పలు అంశాల పై కేటీఆర్ వారితో చర్చిస్తారు.
అలాగే నయీం నగర్లో గల సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ సందర్శించే అవకాశం ఉంది. అనంతరం కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి పై వారితో చర్చిస్తారు. అలాగే ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది.
కాగా ఆరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హనుమకొండకు చేరుకుని, కార్యక్రమాలను ముగించుకొని తిరిగి హెలికాప్టర్ ద్వారానే హైదరాబాద్ చేరుకుంటారు. కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు ఏర్పాట్లను చేసి సంసిద్ధంగా ఉండాల్సింది గా మంత్రి ఎర్రబెల్లి , ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.