వరంగల్ : వరంగల్ జిల్లాలోని వేలేరులో ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్, పార్కింగ్ స్థలం, సభాస్థలితో పాటు శంకుస్థాపన చేసే కార్యక్రమాల స్థలాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఒకే రోజు రూ. 150 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కరువు ప్రాంతంగా ఉన్న వేలేరుకు సాగు, తాగునీరు అందించేందుకు 3 ఎత్తిపోతల ప్రాజెక్టులకు, వివిధ రోడ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి.. కానీ చేసిందేమీ లేదన్నారు. వేలేరు కరువు గురించి సీఎం కేసీఆర్కు చెప్పగా, వెంటనే స్పందించి మూడు లిఫ్టుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలకు ప్రజల్లో విలువ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు కదిలిరావాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఆర్ అండ్ బీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జనగామ పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.