KTR | జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.
భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు శాఖ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 460 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు అందజేస్తారు. 1100 మంది లబ్దిదారులకు దళిత బంధు మంజూరు పత్రాలను అందిస్తారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఎంపిక చేసిన 4500 మందికి గృహాలక్ష్మి మంజూరు పత్రాలను అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు.