నల్లగొండ : గత పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నోముల భగత్కు, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి అండగా ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు. హాలియాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే నోముల భగత్.. రూ. 820 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారని కేటీఆర్ తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పనులు ఈ యువ నాయకుడు మీ అందరికీ చేసి పెడుతన్నాడు. నెల్లికల్ ఎత్తిపోతల పథకం పరుగులు పెడుతున్నది. ఈ ఎత్తిపోతలను రూ. 670 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం.. మిగిలిన ఆయకట్టును ఈ ఎత్తిపోతల ద్వారా సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. మిగిలిన ఆయకట్టుకు సాగునీరు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఆధునీకమైన మినీ స్టేడియం కోసం రూ. 3 కోట్ల 75 లక్షలు మంజూరు చేశామన్నారు. ఓపెన్ డ్రైన్ సమస్య పరిష్కారానికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పెద్దలు మంత్రిగా సుదీర్ఘకాలం పని చేశారు. కానీ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకు ఏం చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ ఫ్లోరోసిస్తో బాధపడ్డారు. అయినప్పటికీ నీళ్లు ఇవ్వలేని అసమర్థత ఆ నాయకులది. తాగునీరు ఇవ్వకపోయినప్పటికీ, సాగునీటి రంగంలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాను నిర్లక్ష్యం చేశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రూ. 46 వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథను తీసుకొచ్చి తండా, గూడెంలోని ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి.. ఈ జిల్లాకు వారు ఏం చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముందుకు వెళ్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.