కామారెడ్డి : మా నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నానమ్మ జ్ఞాపకార్థంగా రూ. రెండున్నర కోట్లతో నిర్మించబోయే స్కూల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కోనాపూర్ గ్రామానికి సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్, తాగునీటి కోసం 2 కిలోమీటర్ల పైపు లైన్, రెండు బస్ షెల్టర్లు, మినీ లైబ్రరీ, మినీ డెయిరీ, మహిళా మండలి భవనం, కొన్ని కుల సంఘాల భవనాలు, గ్రామపంచాయతీకి ప్రహరీ గోడ, పశువైద్య శాల, డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. కోనాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బీబీపేట్కు ఒక జూనియర్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు.
కొంత మంది రాజకీయ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని పట్టుకుని సోయి లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ పుట్టిన నాడే వందల ఎకరాలు ఉన్న ఇంట్లో పుట్టిండు. ఆయనకు ఆస్తులు కొత్త కాదు. పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌజ్ అని పేరు పెట్టి, అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి సీఎం కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రూ. 50 వేల కోట్లను రైతుబంధు రూపంలో 63 లక్షల మంది రైతులకు ఇచ్చారు. రైతు ఏ కారణంగా చనిపోయినా కూడా రైతు బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. ఇలాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరందించి సస్యశ్యామలం చేశామని కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో మానేరు మత్తడి దుంకుతుదని అనుకోలేదు. కానీ ఇవాళ అది ఆవిష్కృతమైందని కేటీఆర్ పేర్కొన్నారు.