KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి, దేశానికే దారిచూపే టార్చ్ బేరర్గా నిలిచింది మన తెలంగాణ. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్ కోసం ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014కు పూర్వం నిత్యకృత్యాలు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నది. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు.
స్వతంత్ర భారతదేశంలో విద్యుత్తు రంగంలో ఏ రాష్ట్రము సాధించని విజయాలు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం కేసీఆర్ పక్కా ప్రణాళికతో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పేరిట ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించి, అనుసరించిన త్రిముఖ వ్యూహం అత్యద్భుత ఫలితాలు ఇచ్చింది. విద్యుత్ ఉత్పత్తికి, వినియోగానికి సంబంధించిన గణాంకాలే తెలంగాణ విద్యుత్ విజయాలను చాటి చెప్తాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 18,567 మెగావాట్లు. తలసరి విద్యుత్తు వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును గనుక పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా ఉన్నది. అంటే తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగంకన్నా 69.40 శాతం ఎక్కువగా నమోదవడం మనందరికీ గర్వకారణం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుకు నిదర్శనం హైదరాబాద్ నగరానికి పవర్ ఐలాండ్! ఆర్థిక, పారిశ్రామిక, ఐటీలాంటి అన్ని రంగాలకూ గుండెకాయలాంటి హైదరాబాద్ను సీఎం కేసీఆర్ ‘పవర్ ఐలాండ్’గా మార్చారు. దేశంలో ఇంకే నగరం కనీసం అలోచించని వినూత్న “పవర్ ఐలాండ్” హైదరాబాద్ నగరానికి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని వల్ల జాతీయ విద్యుత్ గ్రిడ్ విఫలమైనా నగరంలో కరెంటు సరఫరాకు విఘాతం కలగదు. నగరం చుట్టూ 25 కిలోమీటర్లు, 80-100 కిలోమీటర్లు, 180-200 కిలోమీటర్ల పరిధిలో మూడు వలయాల్లో విద్యుత్ ఐలాండ్ నెలకొల్పారు. నేడు దేశంలోనే తొలి పవర్ ఐలాండ్ మెట్రో నగరంగా హైదరాబాద్ ప్రశంసలు అందుకొంటున్నది అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం ద్వారా 6,00,258 మంది ఎస్సీ వినియోగదారులకు, 3,26,385 ఎస్టీ వినియోగదారులకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తోందని తెలిపారు. అదేవిధంగా వృత్తినే ఉపాధిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న 30,013 మంది నాయీ బ్రాహ్మణ వినియోగదారులకు, 55,458 ధోభి ఘాట్లు/లాండ్రీ దుకాణాలకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 5467 పౌల్ట్రీ ఫారాలకు, 6097 పవర్ లూమ్లకు యూనిట్కి రూ.2. సబ్సిడీని అందిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయిన 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగిందని కేటీఆర్ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రికార్డు సమయంలో (48 నెలలు) పాల్వంచ లోని కేటిపిఎస్ 7వ దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంభించిందన్నారు. 470 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి. ‘సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయిన 6×40 మెగావాట్ల లోయర్ జూరాల, 4×30 మెగావాట్ల పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా, ప్రభుత్వ రంగంలో, నల్గొండ జిల్లాలోని దామెరచెర్లలో రూ.34400 కోట్ల పెట్టుబడితో 5×800 మెగావాట్ల యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది అని కేటీఆర్ తెలిపారు.
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల 2023, మే 1వ తేదీ నాటికి రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది. జలవిద్యుత్ ఉత్పత్తిలో 2021-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాని కంటే రికార్డు స్థాయిలో 5654.7 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తిని సాధించడం జరింగింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
⚡⚡సోలార్, జల విద్యుత్తు ఉత్పత్తి లోనూ తెలంగాణ టాప్
⚡ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల… pic.twitter.com/wMJaLs0Opm
— KTR (@KTRBRS) June 5, 2023