హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’లో పనులు పూర్తయిన పాఠశాలల ప్రారంభోత్సవాలు బుధవారం జరుగనున్నా యి. రా్రష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఆయా స్కూళ్ల ను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలను భాగస్వా మ్యం చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి.. ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో కలిసి రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టు పీజీ క్యాంపస్ను ప్రారంభిస్తారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలం రాచులూరు ఎంపీపీ స్కూల్ను ప్రారంభించనున్నారు.
జిల్లాలవారీగా పాఠశాలల సంఖ్య
ఆదిలాబాద్ 37, భద్రాద్రి కొత్తగూడెం 46, హనుమకొండ 28, హైదరాబాద్ 32, జగిత్యాల 36, జనగామ 24, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులాంబ గద్వాల 24, కామారెడ్డి 44, కరీంనగర్ 30, ఖమ్మం 62, కుమ్రంభీం ఆసిఫాబాద్ 30, మహబూబాబాద్ 32, మహబూబ్నగర్ 32, మంచిర్యా ల 36, మెదక్ 42, మేడ్చల్ మల్కాజిగిరి 30, ములుగు 18, నాగర్కర్నూల్ 40, నల్లగొండ 62, నారాయణపేట 22, నిర్మల్ 38, నిజామాబాద్ 59, పెద్దపల్లి 28, రాజన్నసిరిసిల్ల 26, రంగారెడ్డి 55, సంగారెడ్డి 55, సిద్దిపేట 48, సూర్యాపేట 46, వికారాబాద్ 38, వనపర్తి 28, వరంగల్ 26, యాద్రాద్రి భువనగిరి 34 చొప్పున మొత్తంగా 1,210 పాఠశాలల్లో పనులను పూర్తిచేశారు.
12 రకాల పనులు
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల భవనాలకు మరమ్మతులు, రంగులు, ప్రహరీలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నీచర్, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, మేజర్, మైనర్ రిపేర్లు, కిచెన్షెడ్స్, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూళ్లల్లో డైనింగ్హాల్స్, విద్యుత్తు సౌకర్యం, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేశారు.
కేజీ టు పీజీపై కేటీఆర్ ట్వీట్
గంభీరావుపేట, జనవరి 31: గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్యాలయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గంభీరావుపేటలో విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి బుధవారం తాను ప్రారంభించనున్న కేజీ టు పీజీ విద్యా ప్రాంగణాన్ని ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రత్యేకతలు, విశేషాలు
తొలి విడతలో 100కు పైగా విద్యార్థులు ఉన్న 9,123 స్కూళ్లను ఎంపికచేశారు. వీటిలో 5,399 ప్రైమరీ స్కూళ్లు, 1,009 ప్రాథమికోన్నత, 2,715 హైస్కూళ్లు ఉన్నాయి.
తొలుత రూ.30 లక్షలలోపు పనులకు టెండర్లు లేకుండానే పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా పనులు చేపట్టారు. వీటిలో మండలానికి రెండేసి పాఠశాలలను మాడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేశారు.
బడులన్నింటికీ ఒకే కామన్ కలర్కోడ్ అమలు చేశారు. ఆరు బయట ఒక కలర్, తరగతి గదుల్లో ఐదు విభిన్న రంగులను వేశారు. గోడలపై చిత్రాలు, చిత్తరువులను ఆకట్టుకునేలా వేయించారు. తొలి విడతలో 71,115 తరగతి గదులకు పెయింటింగ్ పనులు చేపట్టారు.
బడుల్లో నడకదారులు(పాత్వే), గేటు(ఆర్చ్), గ్రీనరీలను ఏర్పాటుచేశారు. పాతభవనాలన్నింటికీ ఐదు లేయర్ల పూతతో వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేయించారు.
ఒక్కొక్క తరగతి గదికి నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ ట్యూబ్లైట్లు బిగించారు.
విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి వీలుగా బ్యాటరీ ఆపరేటెడ్ నల్లాలను బిగించారు.
మొదటి విడత కోసం 3.41 లక్షల డ్యూయల్ డెస్క్ బల్లలు, 1.39 లక్షల గ్రీన్చాక్పీస్ బోర్డులు, టీచర్లు, గ్రంథాలయాలు, సైన్స్ల్యాబ్లకు అవసరమయ్యే 4.96 లక్షల కుర్చీలు, టేబుళ్లు, స్టూళ్లు వంటి ఫర్నీచర్ను సమకూరుస్తున్నారు.
ప్రైమరీ స్కూళ్లలో 30 మంది, హైస్కూళ్లల్లో 40 మంది విద్యార్థులకు ఒక తరగతి గది చొప్పున మొదటి విడతలో 4,400 కొత్త తరగతి గదులు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
సర్కారు బడిలో చదవడమే ఇష్టం
మా పాఠశాల, ఉపాధ్యాయుల విద్యాబోధన చాలా బాగుంది. స్కూల్లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా నాన్న పోలీస్ అయినా.. నాకు ప్రభుత్వ పాఠశాలలో చదవడమే ఇష్టం. మా నాన్న బదిలీపై ఎక్కడికెళ్లినా అక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతా.
-సుకన్య ఎలిజబెత్, 6వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోధన్
ప్రైవేటు పాఠశాలల కన్నా బాగుంది
మా పాఠశాల ప్రైవేట్ పాఠశాలల కన్నా చాలా బాగుంది. ఇప్పుడు పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పించారు. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పెడతారు. మా ఉపాధ్యాయులు పాఠాలు మంచిగా చెబుతున్నారు. నాకు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడమే ఇష్టం.
-సాత్విక్ అభిషేక్, 4వ తరగతి, తీర్గల్లీ ప్రభుత్వ పాఠశాల, బోధన్